AP High Court: కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టులో విచారణ చేస్తున్న న్యాయమూర్తి బెంచ్ నుండి నిష్క్రమించడం హాట్ టాపిక్ అయ్యింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఎక్స్ అఫిషియో ఓటు హక్కును హైకోర్టు అనుమతితో వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసు సందర్భంలో ఎన్నికల ఫలితాన్ని వెల్లడించకుండా కోర్టుకు వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణలో వాదనలు వినబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసు విచారణను మరో బెంచ్ కి పంపాల్సిందిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్..ప్రధాన న్యాయమూర్తికి సమాచారం పంపారు. బుధవారం కేసు విచారణ సందర్బంగా కొండపల్లి కౌన్సిలర్ల తరపు న్యాయవాది బెంచ్ తో వాదనకు దిగడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేసి వెళ్లారు. భోజన విరామం అనంతరం కేసు విచారణ నుండి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కారణాలను రికార్డ్ చేయాలని ఎంపి కేశినేని నాని తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కోరారు. కారణాలను రికార్డు చేస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. అనంతరం కేసు విచారణ జరుపుతున్న బెంచ్ నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
AP High Court: వివాదాల మధ్య ఎన్నిక
కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ 14, వైసీపీ 14 వార్డులు గెలుచుకోగా ఒకరు స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధిని టీడీపీలో చేరారు. టీడీపీ బలం 15కి చేరింది. వైసీపీకి 14 కౌన్సిలర్ లతో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఓటుతో 15కు చేరింది. టీడీపీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి అక్కడి మున్సిపల్ అధికారులు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కొండపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు వేయడానికి ఎంపి కేశినేని నానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కేశినేని నానికి ఓటు కల్పించడంపై వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. గత నెల 22వ తేదీన కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఎంపి నాని ఓటింగ్ లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యుడు గొడవ చేశారు. దీంతో మరుసటి రోజుకు వాయిదా పడింది. ఆ తరువాత రోజు కూడా వైసీపీ సభ్యుడు గొడవ చేయడంతో నిరవధికంగా ఎన్నికను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున ఎంపీ కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించగా పోలీస్ బందోబస్తుతో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు ఫలితాన్ని కోర్టుకు నివేదించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకూ అధికారికంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెల్లడించలేదు.