AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.45 పై రద్దు కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికో పరిమితం కాదని సీజే అన్నారు. ఆర్ – 5 జోన్ పై ఏపి హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలంటూ రాజధాని రైతులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేననీ, ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్టు కాదని కోర్టు పేర్కొంది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేననీ, భూములు రైతులవి కావని తెలిపింది.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో, కొన్ని అంశలు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమనీ, నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగమని హైకోర్టు పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. కాగా రైతుల పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేపు (శనివారం) సుప్రీం కోర్టుకు అమరావతి రాజధాని రైతులు వెళ్లనున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు.
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామాకు నో చెప్పిన ఎన్సీపీ కోర్ కమిటీ