AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. ఇళ్ల నిర్మాణంలో నిన్న హైకోర్టు సింగిల్ జడ్జి కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సెంటు భూమిలో ఇల్లు ఎలా సరిపోతుంది, ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించండి, అప్పటి వరకూ నిర్మాణాలు చేపట్టవద్దు, కన్వేయన్స్ డీడ్ లు రద్దు చేసి డీ ఫాం పట్టాలు ఇవ్వండి, మహిళలకే కాదు, పురుషులకు, ట్రాన్స్ జెండర్లకు స్థలాలు ఇవ్వండి అంటూ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వ అప్పీలును స్వీకరించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి తీర్పు పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వ అప్పీల్ ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.
AP High Court: కమిటీ నివేదిక, ప్రజాభిప్రాయం తర్వాతే..
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఒత్తడి చేస్తుండటంతో వంద మందికి పైగా లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పేదలందరికీ ఇళ్ల పథకంలో పలు లోపాలను ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్న స్థలాలు ఇళ్ల నిర్మాణానికి సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకూ ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ కీలక ఆదేశాలు ఇచ్చింది.
మంత్రి బొత్స సత్యనారాయమ ఏమన్నారంటే ..?
ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశిస్తూ ఆ నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రకటనలుగా ఇచ్చి ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ అప్పీల్ ను తిరస్కరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని పేర్కొన్న మంత్రి బొత్స కేంద్ర విధి విధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టామన్నారు. హైకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం బాధాకరమని అన్నారు. రాజ్యాంగ బద్దంగానే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామనీ, తీర్పుపై అప్పీలుకు వెళతామని అన్నారు.