AP High Court: కోర్టు ఇచ్చే ఆదేశాలు లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న అధికారులకు ఏపి హైకోర్టు ఝలక్ ఇస్తోంది. కోర్టు అదేశాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన అంశం ఓ పక్క ఐఏఎస్ వర్గాల్లో కలకలాన్ని రేపుతుంది.ఇది మరువక ముందే తాజాగా విజయవాడలోని ఓ ఏసీపీకి ఏకంగా వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం సంచలనం సృష్టించింది.
ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీటు వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలను అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారని ఆగ్రహించిన హైకోర్టు.. ఏసీపీకి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.
ఇంతకు ముందు కృష్ణాజిల్లా కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఇటీవల మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యాయి. కృష్ణా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఇంతియాజ్ పై వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తమకు వర్తింపజేయలేదంటూ జిల్లాలోని చందర్లపాడుకు చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత సంవత్సరం అక్టోబర్ 22న వారికి పథకాన్ని అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే అధికారులు 2020 -21 ఏడాదికి సంబంధించి మాత్రమే నిధులు విడుదల చేసి అంతకు ముందు ఏడాది నిధులు విడుదల చేయలేదు.
దీనిపై బాధితులు కోర్టు దిక్కరణ వ్యాజ్యం వేశారు. బుధవారం జరిగిన కోర్టు దిక్కరణ విచారణకు ఇంతియాజ్, డీఆర్డీఏ పివోలతో పాటు వారి తరపు న్యాయవాదులూ గైర్హజరుకావడంతో హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తమ ముందు హజరుపర్చాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఇదే విధంగా కోర్టు ఆదేశాలు అమలు చేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే వారి విజ్ఞప్తి మేరకు శిక్షను తగ్గించి ఓ రోజంతా కోర్టు హాలులోనే కూర్చునేలా శిక్షను మార్చింది. ఇలా కోర్టు దిక్కరణ వ్యాజ్యాల్లో అధికారులపై శిక్షలు విధిస్తుండటం అధికార వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.