కడప మున్సిపల్ మాజీ కమిషనర్ లవన్నపై ఏపి హైకోర్టు సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా కోర్టుకు హజరు కావాలంటూ వారెంట్ జారీ చేసింది. కోర్టు దిక్కార పిటిషన్ పై విచారణ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మావతి బాయి అనే వృద్ధురాలి ఇంటి కూల్చివేతపై హైకోర్టు స్టే విధించినప్పటికీ .. అధికారులు కోర్టు ఉత్తర్వులు పాటించకుండా తిరిగి బాధితురాలిపైనే కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కోర్టు ఉత్తర్వులు కొంత మంది అధికారులు గౌరవించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్దురాలి ఇంటిని కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ నేత ఇంటికి దారి ఇచ్చేందుకు తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ పద్మావతి బాయి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు స్టే విధించింది. అయితే స్టే ఉత్తర్వులను తీసుకువెళ్లి అధికారులకు ఇస్తే దాన్ని చించివేసి ఇళ్లు, ఫాపులను కూల్చేశారనీ, పైగా బాధితురాలిపై కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. బాధిత వృద్ధురాలిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో నేడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.
విచారణ సందర్బంగా ఆమెను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకువెళుతున్న ఫోటోలు, కూల్చివేత దృశ్యాలను న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు ఇచ్చారు. బాధితురాలికి నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు గౌరవించలేదని న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి ఈ సందర్బంగా ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం .. వ్యక్తిగతంగా హజరు కావాలని అప్పటి కమిషనర్ లవన్నకు వారెంట్ జారీ చేసింది. కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.