AP High court: ఏపి సర్కార్ నిర్ణయాలను హైకోర్టు తరచు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ జంబో పాలకమండలి నియామకంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జివోలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల జివోలు జారీ చేసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా బీజేపీ ఇతర రాజకీయ పక్షాలు తప్పుబడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదే నేపథ్యంలో టీటీడీ బోర్డులో గతంలో ఎన్నడూలేని విధంగా పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్ లు దాఖలైయ్యాయి. ఈ పిటిషన్ లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
నిబంధనలకు విరుద్దంగా బోర్డు సభ్యులను నియమించారనీ, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు వివరించగా, నిబందనలకు అనుగుణంగానే నియామకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.