ఏపి ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టులో మరో చుక్కెదురు అయ్యింది. పలువురు ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా, లీగల్ ఒపీనియన్ లు తీసుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయ సమీక్షను ఎదుర్కొవాల్సి వస్తొంది. ఇంతకు ముందు ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. తాజాాగా జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించిన ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు స్టే విధించింది.
విషయంలోకి వెళితే .. రాష్ట్రంలోని పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అధికారులు ముంపు ప్రాంతాల్లో, స్మశాన వాటిల్లోని స్థలాలను ఇళ్ల పట్టాలుగా కేటాయించారు. అదే క్రమంలో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో దళితుల స్మశాన వాటికను ఇంటి స్థలాలకు కేటాయించడంపై గ్రామానికి చెందిన పెయ్యల యాకోబ్ హైకోర్టును ఆశ్రయించారు. యాకోబ్ తరపున హైకోర్టు న్యాయావాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. దళితుల స్మశాన వాటికను ఇంటి స్థలాలు, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలకు ఎలా కేటాయిస్తారంటూ శ్రవణ్ వాదనలు వినిపించారు. శ్రవణ్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. దళిత స్మశాన వాటికలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తదనంతర చర్యలపై స్టే విధించింది.