AP High Court: జగన్మోహనరెడ్డి సర్కార్ కు ఏపి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న జూవారి సిమెంట్స్ కు, నేడు అమర్ రాజా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన కాలుష్య నిబంధనలు పాటించని కారణంగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిపింది. ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది.
జూన్ 17 నాటికి కంపెనీకి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్య నియంత్రణ మండలి మరోసారి పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా కడప జిల్లాలోని జూవారి సిమెంట్ పరిశ్రమను మూసివేయాలంటూ గత నెల 23 న కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిన్న నిలిపివేసింది. 24 గంటల వ్యవధిలో రెండు పరిశ్రమలకు సంబంధించి ఏపి కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను హైకోర్టు కొ్ట్టివేసిది.
ఇంతకు ముందు కూడా అమర రాజా సంస్థల భూముల కేటాయింపు రద్దుకు సంబంధించి జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. గతంలో ప్రభుత్వం అమర రాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో భూములను కేటాయించగా ఆ భూముల కేటాయింపును రద్దు చేస్తూ జగన్ సర్కార్ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు అమర రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసింది. ఇప్పుడు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. అమర రాజా అధినేత గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ గుంటూరు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా పలు .పరిశ్రమలను మూసివేయాలంటూ ఏపి కాలుష్య నియంత్రణ మండలి ఇస్తున్న ఆదేశాలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.