Justice Kanagaraj: దేనికైనా అదృష్టం కూడా కలిసిరావాలంటారు ఇందుకేనేమో. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏదో రకంగా ఏదో ఒక పదవి ఇచ్చి ఓ పెద్దాయనను సంతృప్తి పర్చాలని చూస్తుంటే అదృష్టం కలిసి రావడం లేదు. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి కనగరాజ్ ను జగన్ సర్కార్ ఎస్ఈసీగా నియమించింది. ఆయన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఈసీ నియామకానికి సంబంధించి నిబందనలను మార్పు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ లను ఎస్ఈసీలుగా నియమించే అనవాయితీ ఉండగా దాన్ని రిటైర్డ్ న్యాయమూర్తులుగా మార్పు చేసి ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది జగన్ సర్కార్. నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అకస్మాత్తుగా తొలగించి ఆయన స్థానంలో ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ ను నియమించింది.
అయితే దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి తన కుర్చీలో మళ్లీ కూర్చున్నారు. దీంతో కనగరాజ్ ఎస్ఈసీ పదవి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ పదవి పోతే పోయింది మరో పదవి ఇద్దామని సీఎం జగన్మోహనరెడ్డి సంకల్పించారు. ఇలా ఆలోచిస్తుండగా వెంటనే ఓ ఐడియా వచ్చింది. పోలీస్ కంప్లైంట్ అధారిటీ చైర్మన్ జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. అయితే జస్టిస్ కనగరాజు ప్రస్తుత వయస్సు 85 సంవత్సరాలు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంత వయసు వారిని నియమించకూడదు. దీంతో ఉత్తరోత్తరా ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఆ వయసుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఓ సవరణ చేసి కనగరాజ్ ను పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా నియమించింది. రిటైర్డ్ న్యాయమూర్తులకు పదవి ఇస్తే కోర్టుల్లోనూ ఇతర న్యాయమూర్తులు సానుకూలంగా ఉంటారని భావించి ఉంటారేమో.
కానీ కోర్టు తీర్పులు ఎక్కువగా మెరిట్స్, డీ మెరిట్స్ అధారంగానే ఉంటాయి. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పదవులు కేటాయింపు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేని వారు కూడా ఉంటారు కదా. ఆ క్రమంలోనే పారా కిషోర్ అనే న్యాయవాది హైకోర్టులో జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని సవాల్ చేశారు. పిటిషనర్ తరపున ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని సస్పెండ్ చేసింది. కనగరాజ్ నియామకం చెల్లదని న్యాయస్థానం ప్రాధమికంగా అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్దంగా జివో జారీ చేశారని హైకోర్టు సదరు జివోను సస్పెండ్ చేసింది. దీంతో జగన్మోహనరెడ్డి సర్కార్ జస్టిస్ కనగరాజ్ కు ఇచ్చిన రెండవ పదవీ పోయింది. అయితే ఈ కోర్టు తీర్పే ప్రభుత్వానికి ఫైనల్ కాదనుకోండి. తీర్పుపై పై కోర్టుకు ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. చూద్దం ఏమిజరుగుతుందో..?