ఏపి సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో నెం.1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. ఏపిలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ ఏపి సర్కార్ ఇటీవల జీవో నెం.1ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా.. స్వాతంత్య్రానికి ముందు ఇాలంటి జీవో ఉందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిటీష్ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే స్వాతంత్య్ర పోరాటం జరిగేదా.. మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్ధం కావడం లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఎప్పుడూ ఇలాంటి జీవో రాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీం కోర్టు గత తీర్పులను న్యాయవాది ప్రస్తావించారు. అంతకు ముందు ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్ పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్ లో రావడానికి ఆస్కారం లేదని పేర్కొన్నారు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదని, జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోందని అన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్దంగా ఉందని అభిప్రాయపడింది. ఈ నెల 23వ తేదీ వరకూ ఆ జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఏపిలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా కొనసాగడంపై సోమేష్ కుమార్ ఇచ్చిన వివరణ ఇది