Dammalapati Case: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యతిరేక తీర్పుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన బంధువులపై గతంలో పోలీసు కేసు నమోదు అయ్యింది.
గతంలో దీనిపై దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నెల రోజుల్లో కేసును తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టులో జస్టిస్ మానవేంద్ర నాధ్ రాయ్ ధర్మాసనం కేసు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం దమ్మాలపాటి, ఆయన బంధువులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అన్యాయంగా కేసు పెట్టి మానసికంగా వేదనకు గురి చేసినందుకు దమ్మాలపాటి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.