AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు పరిపాటిగా మారాయి. తాజాగా మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం అమలునకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల బ్యాంకు అకౌంట్ లో నిధులను జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ డబ్బులను విద్యార్ధుల తల్లులు డ్రా చేసి విద్యాసంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై గతంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల తరపున కృష్ణదేవరాయ వర్శిటీ అసోసియేషన్ హైకోర్టులో సవాల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
AP High Court: ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేత
దీనిపై ఏపి ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు వినిపించగా, యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి ఇకపై జగనన్న విద్యాదీవెన నిధులను నేరుగా విద్యాసంస్థల యాజమాన్యాల్లో వేస్తుందా లేక సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జగనన్న విద్యాదీవెన పంపిణీ సమయంలో సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు. విద్యార్ధుల తల్లులు జగనన్న విద్యా దీవెన నగదును వెంటనే కళాశాలలకు చెల్లించాలని సూచించారు. లేకుంటే రాబోయే రోజుల్లో నేరుగా కళాశాలల అకౌంట్ లోనే నిధులను జమ చేయాల్సి వస్తుందని వెల్లడించారు.