ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఏపి రాజధాని అమరావతి ప్రాంత భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్ తో సహా మరి కొంత మంది రాజధాని లో భూములు ముందుగానే కొనుగోలు చేసుకుని లబ్దిపొందారని ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సీఐడి కేసులు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు.
అయితే భూములు విక్రయించిన వారు ఎవరూ ఫిర్యాదు చేయలేదనీ, ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా కేసులు నమోదు చేసిందంటూ కిలారు రాజేష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులను కొట్టివేసింది.
భూములు అమ్మిన వారు ఎవరూ పిర్యాదులు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ధర్మాసనానికి వివరించారు. అదే విధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఐపీసీ సెక్షన్ లు వర్తించవని కూడా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కిలారు రాజేష్ మరి కొందరిపై కేసులను ధర్మాసనం కొట్టివేసింది.