YS Jagan: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో విద్యుత్ కోతలు ఎక్కువగానే ఉన్నాయి. విద్యుత్ శాఖ సైతం చిన్న చిన్న కోతలు తప్పవని ప్రకటించడం పరిస్థితికి నిదర్శనం. వేసవి సమీపిస్తూండటంతో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం జెన్ కో ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడినంత బొగ్గు నిల్వలు లేకపోవడమేనని తెలుస్తోంది. జెన్ కో రోజువారీ నిర్వహణకే 65వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం 3.2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. జెన్ కో నిరంతరాయంగా కార్యకలాపాలు కొనసాగించాలంటే ఒక్కో ప్లాంట్ వద్ద 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. దీంతో బొగ్గు నిల్వలు మరో నాలుగైదు రోజులకు మించి లేకపోవడం కలవరపెడుతున్న అంశం.
వేసవి అవసరాలు..
వేసవిలో రాష్ట్రావసరాలకు విద్యుత్ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ వీటీపీఎస్ లో 1.6 లక్షలు, కృష్ణపట్నంలో 1.10 లక్షలు, కడప ఆర్టీపీపీలో 50వేల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సహజంగానే వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ నిల్వలు ఏమాత్రం సరిపోనివనే చెప్పాలి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లడంతో సీఎం జగన్ స్పందించారు. బొగ్గు రవాణా కోసం రోజుకు కనీసం 20 రైల్వే ర్యాక్ లు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీంతో రైల్వేతో జెన్ కో సంప్రదింపులు చేస్తోంది. అయితే..
నిధుల సమీకరణ..
ప్రధానంగా నిధుల సమస్య ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో రైల్వే ర్యాక్ కు రవాణా చార్జీల కింద కోటి చెల్లించాలి. చెల్లింపు ఆలస్యమైతే 20లక్షల జరిమానాతో చెల్లించాలి. ఇప్పటికే ఈనెలలో మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్న ర్యాక్ లకు 285 కోట్లు బకాయిలు ఉంది. సింగరేణి సంస్థకు 300 కోట్లు.. గతంలో మరో 300 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ చెల్లించాలని బొగ్గు సరఫరా సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాల్ గా మారింది. ప్రభుత్వం తక్షణమే ముందస్తు చర్యలకు సిద్ధం కాకపోతే వచ్చే వేసవికి విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉంది..!