AP Legislative council: ఈ నెల 17వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. 19వ తేదీన ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక జరగనున్నది. ఇప్పటికే వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. వైసీపీకి శాసనసభలో సంఖ్యాబలం అధికంగా ఉన్నందున ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛన ప్రాయమే. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎంపిక చేయనున్నారు. గత సమావేశాల వరకూ శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన షరీఫ్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మండలి చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో శాసన మండలి కొత్త చైర్మన్ ఎవరు అవుతారు అన్నదానిపై వైసీపీలో చర్చ జరుగుతోంది. శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండు కేబినెట్ ర్యాంక్ కావడంతో మంత్రి పదవి రేసులో లేని పలువురు సీనియర్ వైసీపీ నేతలు వీటిపై ఆశపెట్టుకున్నారు. శాసనమండలిలో క్రమంగా వైసీపీ బలం పెరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బలం 18 మాత్రమే ఉంది. ఈ నెలలో మూడు, వచ్చే నెలలో 11 ఎమ్మెల్సీ స్థానాల వైసీపీకి దక్కనున్నాయి. ఈ నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా, వచ్చే నెలలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనుంది. ఈ ఖాళీల భర్తీ అయితే మండలిలో వైసీపీ సంఖ్యా బలం 32 కు చేరుకోనుంది. దీంతో రెండు పదవులు వైసీపీకే దక్కనున్నాయి.
AP Legislative council: సామాజిక సమీకరణల అధారంగానే
అయితే ఏపి సీఎం వైెఎస్ జగన్మోహనరెడ్డి నామినేటెడ్ పదవుల పంపిణీలో సామాజిక సమీకరణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు జగన్ ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవులు బీసీ, అగ్రవర్ణాలకు కేటాయించిన నేపథ్యంలో మండలిలో ఎస్సీ, మైనార్టీలకు ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో మండలి కొత్త చైర్మన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కే మోషేన్ రాజును ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ హయాంలో మండలి చైర్మన్ పదవి ముస్లిం మైనార్టీలకు ఇచ్చినందున ఇప్పుడు డిప్యూటి చైర్మన్ పదవి మైనార్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ మనసులో ఏముందో ఏమో తెలియని వైసీపీ నేతలు ఆ పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఈ కీలక పదవులు ఎవరికి దక్కనున్నాయో వేచి చూడాలి.