AP Local Body Elections : ఏపిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించవచ్చంటూ డివిజన్ బెంచ్ నేడు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కౌంటింగ్ నిలుపుదల చేయాలని ధర్మాసనం ఎస్ఈసీని ఆదేశించింది.
తొలుత ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేసినందుకు ఆ దేశాలను రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఎస్ఈసీ నోటిఫికేషన్ తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
డివిజన్ బెంచ్ తీర్పు పట్ల తాము సంతృప్తికరంగా లేమనీ, సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. దీనిపై న్యాయసలహా తీసుకున్న తరువాత ముందుకు వెళతామన్నారు. కాగా రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.