Perni Nani: రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యాపారం చేస్తుందంట అంటూ మేధోబలులు విషప్రచారం చేస్తున్నారంటూ సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. ఈ అంశంపై సినీ పెద్దల సూచనల మేరకే ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగిందనీ, దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించాలని ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కాదన్నారు.
పన్ను ఎగవేత జరగకుండా ఉండేందుకు, బ్లాక్ టికెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అపరమేధావులు.. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేందుకు తాడు తెచ్చారు అన్నచందంగా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2002 సంవత్సరంలోనే ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మించే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని గుర్తు చేస్తూ..ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ ద్వారా టికెట్ల విక్రయానికి సంబంధించిన ఇచ్చిన ఉత్తర్వులు, జరిగిన తీర్మానాలు తదితర విషయాలను వెల్లడించారు.
ప్రముఖ నటుడు చిరంజీవి సహా పలువురు సినీ పెద్దలు గతంలో సీఎం జగన్మోహనరెడ్డికి వివిధ అంశాలపై ఇచ్చిన వినతి పత్రంలోనూ ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై చర్యలు తీసుకోవాలని కోరారనీ, వారి సూచనల మేరకే ప్రభుత్వం దానిపై పరిశీలించిందన్నారు. అధిక రేట్లను టికెట్లను విక్రయించకుండా, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8న ప్రభుత్వం జివో ఇచ్చిందని చెప్పారు. పన్నుల ఎగవేత అరికట్టవచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయనీ, ఆ నేపథ్యంలోనే ఆన్ లైన్ సినిమా టెకెట్లను అమ్మవచ్చని గత ప్రభుత్వాలు నిర్ణయించగా దానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమ్మతిని కూడా తెలియజేసిందన్నారు. ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.