10th exams: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తులతో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేశాయి. ఏపిలోనూ కరోనా కేసులు ఏడు వేలకు పైగా నమోదు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ విద్యాసంస్థలను మూసివేయాలనీ, పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ వినబడుతోంది. అయితే ఏపి ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏమంటున్నారంటే….గత ఏడాది జూన్ లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే నిశితంగా గమనించి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కూడా పరిస్థితులను గమనిస్తున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు. విద్యాసంస్థలు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయని వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన సంకేతాలు వారం, పదిరోజుల నుండి వస్తున్నాయి. ప్రతి పాఠశాలలోనూ నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నాం. ఇప్పటి వరకూ పది లక్షల మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాం. విద్యాసంవత్సరం నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నది అని ఆదిమూలపు స్పష్టం చేశారు.
పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు షెడ్యుల్ ప్రకారమే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నదనీ, అయితే విద్యాశాఖ సిద్దంగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం ఇది అని చెప్పలేమన్నారు. పరీక్షల విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలు తప్పక నిర్వహిస్తామనీ గానీ రద్దు చేస్తామని ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యాసంస్థల్లో కరోనా కేసుల పెరుగుదల ఉన్న మాట వాస్తమే కానీ అవి వందల సంఖ్యలో అయితే లేవన్నారు. కరోనా సోకిన విద్యార్థులను వెంటనే ఐసోలేషన్ కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.