విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్ లో తెలంగాణ సర్కార్ పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏపి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఘాటుగా స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న కేసిఆర్ .. మళ్లీ అదే ప్లాంట్ ను కొంటారని ఎలా అంటారని ప్రశ్నించారు. ఒక వేళ అదే నిజమైతే ప్లాంట్ అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా అని ప్రశ్నించారు. అసలు దీనిపై కేసిఆర్ నుండి గానీ, బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన తమ దృష్టికి రాలేదన్నారు. ప్రైవేటీకరణ వద్దని కేసిఆర్ చెప్పినప్పుడు ఆయనే మళ్లీ కొనేందుకు ముందుకు వస్తున్నారంటూ మీడియాలో ఎలా రాస్తారన్నారు. రాజకీయంగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తుంటాయనీ, రాజకీయంగా దుమారం రేపే గాలి వార్తలపై తాము సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు మంత్రి అమరనాథ్.

ముమ్మాటికీ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ గానే తాము భావిస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్న విధానంపైనే తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ను కాపాడేందుకు తాము పారాటం చేస్తూనే ఉన్నామనీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి కూడా ప్రభుత్వం తరపున తాము మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడిపించాలని, ప్రైవేటీకరణ కు మా ప్రభుత్వం వ్యతిరేకమని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ అనేక మార్లు కేంద్రానికి వివరించారని చెప్పారు. దీనిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపి తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తూ ప్రధాన మంత్రి మోడీకి మూడు సార్లు సీఎం జగన్ లేఖలు రాశారని మంత్రి అమరనాథ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ అధికారికంగా తీసుకునే స్టాండ్ ఏమిటో తెలిసిన తర్వాత అప్పుడు దానిపై తాము స్పందిస్తే కరెక్టుగా ఉంటుంది కానీ గాలి వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు మంత్రి అమరనాథ్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెనక్కు తీసుకోవడం లేదు. ప్రైవేటీకరణ దిశగానే అడుగులు వేస్తొంది. ఈ తరుణంలో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఏపి, తెలంగాణ సర్కార్ కు లకు కీలక సూచన చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదల్చుకోగా కేరళ ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేస్తూ అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పునరుద్దరించడానికి ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ సూచించారు. తాజాగా ఏపి మంత్రి అమరనాథ్ చెప్పిన మాటలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదనేది స్పష్టమైంది.
CM YS Jagan: ఈ నెల 21న లండన్ కు సీఎం జగన్..?