పోలవరం ముంపు గ్రామాలకు మళ్లీ తెలంగాణలో కలపాలంటూ ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యలో ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని అన్నారు అంబటి. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపిలో కలిపారనీ, ఈ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని చెప్పారు. మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదనీ, తనకు సాంకేతిక అంశాలు తెలియకపోయినా కామన్స్ సెన్స్ ఉందని అంబటి వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య శాఖ మంత్రులు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా అని ప్రశ్నించారు రాంబాబు.
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని కేంద్రం చెప్పడంపై స్పందిస్తూ దీనిలో టీడీపీ అయిదేళ్లు, వైసీపీ మూడేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఎక్కువ సమయం ఎవరు అధికారంలో ఉన్నారని అంబటి ప్రశ్నించారు. కొత్త డీఆర్ఆర్ ఆమోదం అంశం కేంద్రం వద్దే పెండింగ్ లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా రూ.2,700 కోట్లు ఏపి రావాల్సి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే పోలవరం స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి చేశామని చెప్పారు. గోదావరికి బారీ వరద వచ్చినా ప్రాణనష్టం జరగకుండా చూశామని అన్నారు మంత్రి అంబటి. వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2వేలు చెల్లించామని చెప్పారు.
కాగా మరో పక్క వరద ముంపు ను నుండి శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ అయిదు గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. ఈ అయిదు గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ ప్రాంత ఎమ్మెల్యే వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.