AP Minister Avanthi Srinivas: ఏపి ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీ ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన కామెంట్స్ పై అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఏపి అప్పుల గురించి ఆమె మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ పై మాట్లాడాలన్నారు. అదే విధంగా విభజన చట్టంలోని హామీల అమలుకై ఆమె చేస్తున్న కృషి ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని స్టీల్ ప్లాంట్ లను ప్రైవేటు పరం చేయకుండా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ నే ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తుందని ప్రశ్నించారు. ఏపి అంటే కేంద్ర ప్రభుత్వానికి అంత లోకువా అని అన్నారు మంత్రి అవంతి. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పని చేస్తుమన్నామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెండు సార్లు కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏపిపై శ్రద్ద ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
Read More: Daggubati Purandeswari: వైసీపీ సర్కార్ పై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..
AP Minister Avanthi Srinivas: టీడీపీ కుట్రలు చేసినా
విశాఖ జిల్లాలో భూసేకరణపై దాఖలైన పిల్ ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి అవంతి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నంతో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల ద్వారా ఆర్ధికంగా బలోపేతం అవుతారని అన్నారు. 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్యానికి వైఎస్ఆర్సీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు.
AP Minister Avanthi Srinivas: కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు పెట్టే యోచన
ఇదే సందర్భంలో రాజధానుల అంశంపైనా మాట్లాడారు మంత్రి అవంతి. సాంకేతిక అడ్డంగులు అన్ని తొలగించుకుని మూడు రాజధానుల ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఒకే చోట రాజధాని ఉంటే మరో యాభై సంవత్సరాల తర్వాత అయినా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని, అప్పుడు ఏమి చేస్తారని ప్రశ్నించారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని మంత్రి అవంతి అన్నారు. రాజధాని ఆగిపోయిందని ప్రభుత్వంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. యాబై సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన హైదరాబాద్ ఏమయిందో మనం చూశాం కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి చేపట్టిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ను కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ పెట్టే యోచన చేస్తున్నాయని మంత్రి అవంతి తెలిపారు,