సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా, ఏపీజేఏసీ అమరావతి, ఏపి సీపిఎస్ యూఎస్, ఏపి సీపీఎస్ ఈఏ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల కోసం సీపీఎస్ కంటే మెరగైన స్కీమ్ తేవాలని జీపీఎస్ ను తెచ్చామని చెప్పారు. జీపీఎస్ లో కూడా మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగులతో చెప్పినట్లు తెలిపారు.
ఉద్యోగి రిటైర్ అయ్యాక కనీసం రూ.10వేల ఫించను ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పారు. ఉద్యోగి, వారి భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామనీ, ఉద్యోగి చనిపోయినా భార్యకు పింఛను సదుపాయం ఇస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించామన్నారు. అయితే జీపీఎస్ ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి. ఉద్యోగ సంఘాలతో మరో సారి చర్చిస్తామనీ, సవరించిన జీపీఎస్ పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామనీ, ఆ తర్వాత జీపీఎస్ కు చట్టబద్దత కల్పిస్తామని మంత్రి బొత్స తెలిపారు. సమావేశంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సంఘ నేతలు కోరారనీ, తీవ్రమైన కేసులు పెట్టిన వాటిపై రేపు సీఎం వద్ద చర్చిస్తామన్నారు.
ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని నేతలతో చెప్పినట్లు మంత్రి బొత్స వివరించారు. మరో సారి సమావేశమై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని చెప్పిన మంత్రి బొత్స.. అయినా ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే తాము ఏమీ చేయలేమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం జగన్ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని తెలిపారు. జీపీఎస్ విధానంలో కొన్ని మార్పులు చేసి అమలు చేయనున్నామని చెప్పారు. పాత పెన్షన్ విధానం ప్రభుత్వానికి భారంగా మారుతుందనీ, ఉద్యోగులు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు.
మంత్రులకు సీరియస్గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?