ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడంతో మరో సారి కేబినెట్ విస్తరణకు ఛాన్స్ ఉందంటూ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఎవరికి ఉధ్వాసన ఉంటుంది. ఎవరు లక్కీ ఛాన్స్ కొడతారు అనే దానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అధికారికంగా అయితే ఇంత వరకూ సమాచారం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుండగా, శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయంపై మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం, విచక్షణాధికారం అన్నారు. దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్టు కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలకు మంత్రి వర్గ మార్పునకు సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తన వైఫల్యమే కారణమని అన్నారు. లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. ఓటమిని వేరే వారిపైకి నెట్టడం తనకు అలవాటు లేదని చెప్పారు.
విశాఖ నుండి తక్షణం పరిపాలన ప్రారంభం కావాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని బొత్స చెప్పారు. వికేంద్రీకరణ అనేది తమ ప్రభుత్వ, పార్టీ విధానమని మరో సారి స్పష్టం చేశారు. టీడీపీ వంటి కొన్ని దుష్ట శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమ స్పూర్తి అంటే టెంట్లు వేసుకోవడమా అని ప్రశ్నించారు. అక్కడ ఉన్నది రైతులు కాదనీ, టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకుడు సత్యకుమార్ పై దాడి చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయంగా తమ పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అండ్ కో ల్యాంగ్ పూలింగ్ పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. కోర్టుల్లో సాంకేతిక కారణాలతో అలస్యం అవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే తమ ప్రధాన ఎజెండా అని తెలిపారు బొత్స. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దానిపైనా క్లారిటీ ఇచ్చారు బొత్స. స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందస్తుకు ఎందుకు వెళతామని బొత్స ప్రశ్నించారు.
Adani: కొచ్చిలోని ఆదానీ పైప్ లైన్ నుండి కెమికల్ గ్యాస్ లీక్