YSRCP Bus Yatra: వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభించనున్న బస్సు యాత్రను పురస్కరించుకుని “సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” పేరుతో రూపొందించిన ఆడియో, వీడియోలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడువిడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.రేపటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయ భేరిని మోగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ఈ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను చేపట్టామన్నారు రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అటు ప్రభుత్వంలోనూ, ఇటు స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు, వివిధ కార్పొరేషన్ పదవుల్లో సముచిత స్థానం ఇవ్వడంలో ఆ వర్గాలకు ఏ విధంగా న్యాయం కల్పించామనే అంశాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టామని బొత్సా పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత ప్రభుత్వాల హయాంలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఈ వర్గాలకు పదవులు ఇచ్చి గొప్పగా చెప్పుకునే నేపథ్యం చూశామన్నారు మంత్రి బొత్స సత్యనాారాయణ. నేడు జగన్ నాయకత్వంలో మంత్రివర్గంలో 25మంది మంత్రులు ఉండగా అందులో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50శాతం కంటే ఎక్కువగా నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా ఈ వర్గాలకు జగన్ అవకాశం కల్పించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం ద్వారా సముచిత స్థానం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్ కే దక్కుతుందన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ.
రేపు శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఈ బస్సు యాత్రలో 17మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా ప్రాంతాల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నవారంతా పాల్గొంటారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ విజ్ఢప్తి చేశారు.