డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ గా ఏపి సర్కార్ మార్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతుండగా, టీడీపీ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా ఏపి మంత్రి దాడిశెట్టి రాజా చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులకు, టీడీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ అంశంపై మంత్రి దాడిశెట్టి రాజా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
స్వర్గీయ ఎన్టీఆర్ ను స్వర్గీయ వైఎస్ఆర్ ను పోలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందనీ, అయితే తన వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఎన్టీ రామారావుకు అసలు పోలికే లేదని అన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. రామారావు అంత చేతగాని వాడు భారతదేశం మొత్తం మీద ఇంకెవ్వరూ లేరు. రాష్ట్రం మొత్తం ఆయన గుప్పిట్లో ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సారి కాదు రెండు సార్లు ఆయన వెన్నుపోటు పొడిపించుకున్నాడు. అందుకే తాను చేతగాని వాడు అంటున్నానన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక సారి నాదెండ్ల భాస్కరరావుతో వెన్నుపోటు పొడిపించుకున్నాడు. అల్లుడు చంద్రబాబుతో మరో సారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు అని వ్యాఖ్యానించారు. మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ అంటే అమితమైన గౌరవం ఉందని చెప్పే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు.. ఈ మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని పురందేశ్వరి ప్రశ్నించారు. ఒక వేళ మంత్రిపై చర్యలు తీసుకోకపోతే ఇది మీ అభిప్రాయం కూడా అని భావించాలా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ కామెంట్స్ చేసిన వారు మీ కేబినెట్ మంత్రి అని పేర్కొంటూ.. మంత్రి దాడిశెట్టి రాజా మాటల వీడియోను షేర్ చేశారు. అయితే మంత్రి దాడిశెట్టి రాజా ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కామెంట్స్ చేశారు. ఆ కారణంతోనేమో సీఎం వైఎస్ జగన్ .. దగ్గుపాటి పురందేశ్వరి ట్వీట్ కు స్పందించలేదు.
హెల్త్ యూనివర్శిటికీ ఎన్టీఆర్ పేరు తొలగించడంపై నందమూరి లక్ష్మీపార్వతి స్పందన ఇది