ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీళ్లు పెన్షన్లను ఇళ్లకు వెళ్లి లబ్దిదారులకు అందించడం, సర్వేలు చేయడం, ప్రభుత్వం అందేంచే వివిధ సంక్షేమ పథకాలను వారికి తెలియజేసి ధరఖాస్తులు చేయించి మంజూరు అయ్యేలా కృషి చేయడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో ప్రజానీకానికి వాలంటీర్లు చాలా దగ్గర అయ్యారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ప్రజా ప్రతినిధి చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లకుండానే వాలంటీర్ల ద్వారానే తమ పనులు చేయించుకుంటున్నారు. దీంతో వాలంటీర్లు కీలకంగా మారారు. వాలంటీర్లు వారి వారి పరిధిలో ప్రజలతో మమేకం అవుతూ మంచి పేరు సంపాదించుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు ప్రజా ప్రతినిధులు (ఎంపీటీసీ, సర్పంచ్) గానూ ఎన్నికైయ్యారు.

మరో ఎడాదిన్నలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలను వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అయితే ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతున్న కారణంగా వాలంటీర్ల సేవలను నేరుగా పార్టీ వినియోగించుకుంటే విమర్శలు వచ్చే ప్రమాదం ఉన్నందున పార్టీ పరంగా గృహ సారధులను నియామకం ప్రకియ మొదలు పెట్టింది. అయినప్పటికీ వైసీపీ ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు) తరచు వాలంటీర్లతో సమావేశాలను నిర్వహిస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల గౌరవ వేతనం రూ.15వేల పెంపునకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారంటూ ఇటీవల మంత్రి విశ్వరూప్ హామీ ఇచ్చారు.
దాదాపు మూడు సంవత్సరాలుగా కేవలం రూ.5వేల వేతనంతో పని చేస్తున్న వాలంటీర్లలో ఉన్న అసంతృప్తిని తొలగించి వారిలో ఆశలు చిగురింపజేశారు మంత్రి విశ్వరూప్. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లేనని అన్నారు. వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వాలంటీర్లపై తుపాకి పేల్చే అవకాశం చంద్రబాబుకు ఇవ్వకుండా మనమే పేలిస్తే సరిపోతుందని అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన.
గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త