ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన సెక్యూరిటీ అధికారికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షో పై పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారని అన్నారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. రాయి విసిరించుకోవడం ఆ నాటకంలో భాగమని అన్నారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ అధికారి గాయపడటం బాధాకరమని అన్నారు మంత్రి జోగి రమేష్. ఈ రాయి దాడి ఘటనలో గాయపడిన సెక్యూరిటీ అధికారికి చంద్రబాబే క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదే సందర్బంలో జోగి రమేష్ చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులను పోటీకి నిలిపే ధైర్యం చంద్రబాబు కు ఉందా అని ప్రశ్నించారు. లోపాయికారీ పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారనీ అది సాధ్యం కాదని అన్నారు. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రశ్న సంధించారు. వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్ధిని అని ప్రకటించుకునే దమ్ము పవన్ కళ్యాణ్ కు ఉందా అని జోగి రమేష్ ప్రశ్నించారు.