AP Minister Karumuri Nagasawara Rao: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉచిత బియ్యం ఏపిలో ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు చేసిన విమర్శలపై ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలోని పేదలపై బీజేపీ నేతలకు అంత ప్రేమ ఉంటే పూర్తి స్థాయిలో పేదలందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కారుమూరి. ఏపి ప్రజలపై బీజేపీ నేతలు లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం నూటికి నూరు శాతం మందికి అంటే, రాష్ట్రంలో ఉన్న 1.46 కోట్ల మంది పేదలకు నూకలు లేని నాణ్యమైన బియ్యాన్ని ఇస్తుండగా , కేంద్రం కేవలం 86 లక్షల మందికే, అది కూడా నాన్ సార్టెక్స్ బియ్యాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటుందని వివరించారు. కేవలం 60 శాతం మందికి ఇస్తూ రాష్ట్రంలోని పేదలందరినీ ఉద్ధరిస్తున్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడటం సమంజసం కాదన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Minister Karumuri Nagasawara Rao: కేంద్రం తీరు ఇది
కేంద్రం సరఫరా చేసే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని, అది కూడా కొంత మందికి ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం తమ వల్ల కాదని అన్నారు. వంద మంది భోజనానికి కూర్చుంటే 60 మందికి వడ్డించి మిగతా 40 మందికి మానేసే పని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చేయమంటుందనీ అది తమ వల్ల చేతకాదు అని అన్నారు. రాష్ట్రంలోని 1.46 కోట్ల పేద కుటుంబాలకు సార్టెక్స్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార అందిస్తున్నామని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ ను పెంచాలని సీఎం వైఎస్ జగన్ నీతి ఆయోగ్ కు లేఖ రాస్తే.. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులన్నీ కరెక్టుగా ఉన్నాయని, వారికి బియ్యం పంపిణీ చేయాలని కేంద్రానికి కూడా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కేంద్రం ఇప్పటి వరకూ బియ్యం విడుదల చేయలేదన్నారు మంత్రి కారుమూరి .
దేశంలో ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ లలో కేంద్ర ప్రభుత్వం 75 శాతం మందికి బియ్యం అందిస్తూ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 60 శాతం లోపలే పేదలకు బియ్యం ఇస్తున్నారనీ, ఇది ఏపీ పట్ల వివక్షత చూపుతున్నట్లు కాదా అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి. రాష్ట్రంలోని 1.46 కోట్ల మందికి రేషన్ ఇవ్వాలని, సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి మోడీకి లేఖ కూడా రాశారని చెెప్పిన కారుమూరి.. ఏపి ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి బీజేపీ నేతలకు ఉన్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అందరికీ బియ్యం అందేలా చూడాలని కోరారు. బీజేపీ నేతలు ముందుగా ఈ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.