Kodali Nani: ఏపిలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం దుంధుబి మోగించడంతో టీడీపీ చతికిల పడిన సంగతి తెలిసిందే. వైసీపీ 151 స్థానాలు కైవశం చేసుకోగా టీడీపీ నుండి కేవలం 23 మంది మాత్రమే గెలుపొందారు. ఆ తరువాత టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేయడానికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. గట్టిగా మాట్లాడే టీడీపీ నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతూనే ఉంది. ఇంతకు ముందు ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, హత్య కేసులో కొల్లు రవీంద్రలను, వివిధ కేసుల్లో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జైలు ఊచలు లెక్కపెట్టారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ వివిధ అంశాలపై ఆందోళనలకు సమాయత్తం అవుతుంది. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. చంద్రబాబు, దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో మరో సారి కొడాలి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి. చంద్రబాబు గోబెల్స్ అయితే దేవినేని ఉమా అంతకు మించిన వ్యక్తి అని, ఉన్నది లేనట్లు అభూతకల్పనలు చేస్తుంటాడని విమర్శించారు. దేవినేని ఉమా నిన్న ఉద్దేశపూర్వకంగానే వెళ్లి ప్రజలపై దుర్భాషలాడారని, వైసీపీ నేత కారు అద్దాలు పగులగొడితే దాన్నే దేవినేని ఉమా కారుగా చూపించారని మండిపడ్డారు. దాడి చేయడంతో పాటు దళితులపైనా ఉమా దుర్భాషలాడారని, పోలీసులపైనా ఉమ దురుసుగా ప్రవర్తించారని కొడాలి ఆరోపించారు.
కొండపల్లిలో తాను పుట్టకపూర్వం నుండే క్వారీలు ఉన్నాయనీ, అత్యంత ఎక్కువ మైనింగ్ జరిగింది టీడీపీ హయాంలోనేనని పేర్కొన్న కొడాలి.. ఉమాపై తీవ్ర ఆరోపణ చేశారు. అక్కడ కాంట్రాక్టర్లను ఉమ డబ్బుల కోసం బెదిరించారనీ, ఆ తరువాత అటవీ భూమి అని బెదిరించి అనుమతులు రద్దు చేయించారని ఆరోపించారు.
కాగా.. రాష్ట్రంలో బీజేపీకి పది శాతం ఓటింగ్ కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు అన్నది అందరికీ తెలిసిందే. టీడీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతంకు పైగా అయినా ఓటింగ్ వచ్చింది. ప్రస్తుతం టీడీపీకి తెలంగాణలో ఉన్నంత గడ్డు పరిస్థితి అయితే లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీని తీసుకువెళ్లి బీజేపీలో ఆరు నెలల్లో విలీనం చేస్తారని కొడాలి అనడం జోస్యం చెప్పినట్లేగా !.