AP Minister Perni Nani: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నేడు జనాగ్రహ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఈ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపి సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆ పార్టీపై, కేంద్రంలోని ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనం ఎవరిపై ఆగ్రహంతో ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీజేపీకి ఒక విధానం, పాలసీ అంటూ ఏమిలేదని విమర్శించారు. వేరే పార్టీ నుండి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేష్ లకు పార్టీని లీజ్ కు ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహనరెడ్డి సర్కార్ పై విమర్శించే అర్హతే వారికి లేదని అన్నారు. ఆర్బీఐ గైడ్లైన్ కు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తోందని, ఆలా కాకుండా అప్పు చేస్తే కేంద్రం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులు చేస్తుంది అప్పులు చేస్తుంది అని గగ్గొలు పెడుతున్న బీజేపీ కేంద్రంలో అప్పులు చేయకుండా అన్ని రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఏమైనా అప్పులు ఇస్తుందా, అప్పుకోసమే పునిత్ వచ్చి వెళ్లారా అని ఎద్దేవా చేశారు.
AP Minister Perni Nani: మోడీ చేసింది అప్పుకాదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్క ఉంది. ఎక్కడకు వెళ్లిందో, జనాలకు ఎలా చేరిందో చెప్పగలమని నాని అన్నారు. భారతదేశానికి ప్రస్తుతం కోటి 35 లక్షల 86 వేల975 కోట్లు అప్పు ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2014 సంవత్సవరం వరకూ రూ.62లక్షల 42వేల 221 కోట్లు అప్పు ఉంటే మోడీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో రూ.73 లక్షల 44వేల 754 కోట్లు అప్పు చేశారనీ, అందులో రూ.4లక్షల 27వేల 925 కోట్లు విదేశీ రుణం ఉందన్నారు. ఇప్పుడు వీళ్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎంతో క్రమశిక్షణతో ఏపి ప్రభుత్వం ఆర్ధిక చట్టాలను అతిక్రమించకుండా అప్పులు తేవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక చట్టాలను అతిక్రమిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకునేదా అని మంత్రి నాని ప్రశ్నించారు.
పోలవరంపై ఈడీ విచారణ ఎందుకు వేయలేదు..?
ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే వాటిపై మాట్లాడకుండా సినిమా టికెట్లు ధరలు పెంచాలి, మద్యం బాటిళ్ల ధరలు తగ్గించాలని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరల నియంత్రణ ఎవరి ఆధీనంలో ఉందో తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోలవరం స్కామ్ అన్నారు, ఏటీఎంగా వాడుకున్నారు అని అన్నాడు, దానిపై ఈడీ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయి. వాటి గురించి మాట్లాడరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అజెండానే బీజేపీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
AP Minister Perni Nani: మోడీ బయటకు వస్తున్నారా
చంద్రబాబు రావణాసురుడు అయితే ఆయన పది తలల్లో బీజేపీ, జనసేన, సీపీఐ అలా అన్ని ఉన్నాయన్నారు. ఇప్పుడు వీళ్లంతా ఆలింగనం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పెద్ద మానిప్లిటర్ అని మోడీ ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చారని నాని అన్నారు. నేటి బీజేపీ సభలో విభజన హామీల అమలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరల గురించి మాట్లాడితే బాగుంటుందని నాని హితవు పలికారు. జగన్మోహనరెడ్డి బయటకు రావడం లేదు జనాల్లోకి రావడం లేదు అని విమర్శిస్తున్నారు, మరి మోడీ బయటకు వస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే మోడీ బయటకు వస్తున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. ఇలా అన్ని అంశాలపై బీజేపీని తూర్పారబట్టారు మంత్రి నాని.