Bjp: ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజకీయంగా ఎదురులేదు. ఆయన పరిపాలనకు తిరుగులేదు. 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనూహ్య విజయాన్ని అందించారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు కైవశం చేసుకోవడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఇక రాష్ట్రంలో తనదైన మార్క్ పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను పంచి పెడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను కోర్టులు తప్పుబడుతున్నా ప్రజలు మాండెట్ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం చేసే పనులను అడ్డుకోవడం ఏమిటన్న ధోరణిని వైసీపీ ప్రదర్శిస్తోంది. వివిధ అంశాలలో ప్రతిపక్షాల సూచనలు, సలహాలను సైతం ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో పలు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను టీడీపీ, బీజేపీ, వామపక్షాల నేతలు విమర్శిస్తూ ఉన్నారు.
ఇదే క్రమంలో ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక గందరగోళం తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులను దారి మళ్లించడంపై, ఎఫ్ఆర్బీఎం నిబంధనలను గాలికి వదిలి భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి విచ్చలవిడిగా అప్పులు చేయడంపై తగిన విచారణ జరిపించాలని, ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ జగన్ వల్ల చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో మరింతలా చితికి పోకుండా కాపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ నేతల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రాన్ని అందించారు అయితే రాష్ట్ర ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ, టీడీపీ నేతలు విమర్శిస్తుంటే మంత్రులు వాటికి సరైన కౌంటర్ లు ఇవ్వకపోవడంపై సీఎం వైఎస్ జగన్ మంత్రులకు క్లాస్ పీకారని వార్తలు వచ్చారు.
ఈ తరుణంలో నిన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బీజేపీ, టీడీపీపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపిలో కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నది బీజేపీ ఆశ అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజెపీ కుమ్మక్కయ్యే పార్టీలని అన్నారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రేమలేఖలు రాస్తున్నారని మంత్రి నాని సెటైర్ వేశారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఏపిలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారని మంత్రి నాని సంచలన ఆరోపణ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం వైసీపీపై గుర్రుగా ఉందా? మంత్రి నాని ఈ ఆరోపణలను సంచలనం కోసం బీజేపీపై చేశారా? లేక పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ వ్యాఖ్యలు చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా నాని వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?