AP Minister Perni Nani: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి జేఏసి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రపై ఏపి మంత్రి పేర్ని నాని స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమైన రైతులు చేస్తున్న పాదయాత్ర కాదని పేర్కొన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, సానుభూతిపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న పాదయాత్ర ఇది అని మంత్రి నాని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు అని విమర్శించారు. నిజమైన రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇప్పుడు పాదయాత్ర పేరుతో చంద్రబాబు మరో సారి మోసం చేస్తున్నారని అన్నారు. కోర్టులను కూడా మోసం చేసి టీడీపీ దొంగ యాత్రలు చేస్తోందని విమర్శించారు. పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకుంటున్నారని మంత్రి పేర్ని విమర్శించారు.
AP Minister Perni Nani: యాత్రకు నిర్మాత, దర్శకత్వం, స్క్రీన్ ప్లే చంద్రబాబే
రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారనీ దుయ్యబట్టారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్ర్కీన్ ప్లే చంద్రబాబేనని విమర్శించారు. పార్టీ కార్యకర్తలను కూడా చంద్రబాబు దిగాజార్చుతున్నారని అన్నారు. రైతుల పేరుతో ఉన్న పెట్టుబడిదారులను నట్టేట ముంచింది ఎవరని ప్రశ్నించారు. పేదవారికి అమరావతిలో ఇళ్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అనే వాళ్లు రైతులు ఎలా అవుతారని పేర్ని ప్రశ్నించారు. నిజమైన రైతులు ఎవరూ ఇలా ఆలోచించరని అన్నారు. టీడీపీ చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుంటుందని సెటైర్ వేశారు మంత్రి పేర్ని నాని.
లోకేష్ మానసిక వైద్యుడికి చూపించుకోవాలి
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి పేర్ని స్పందించారు. కుప్పంకు ఎమ్మెల్యేగా, ఇంతకు ముందు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడుగా మీ నాయన ఏమి పీకారని ప్రశ్నించారు. చంద్రన్న దేవుడు అంటున్నాడు, ఎవరికి దేవుడు, లోకేష్ ను మానసిక వైద్యులకు చూపించాలన్నారు. కుప్పంలో ఓటుకు రూ.1500, 2వేలు ఇస్తూ లోకేష్ తిరుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1989 నుండి ఇప్పటి వరకూ కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు హంద్రీనీవాలో నీళ్లు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. రెండేళ్లల్లో ఏం పీకార్రా అని లోకేష్ అని లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై తీవ్రంగా స్పందించారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఒక్కసారి కూడా కుప్పంకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తండ్రి కొడుకులకు ఎన్నికలు రాగానే కుప్పం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెడుతున్న లోకేష్ కు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకూ పచారీ సరుకులు రోడ్డుపై పోసి ఊరిగే ఇచ్చారా అని ప్రశ్నించారు. హెరిటేజ్ లో చింతపండు ఎంత అమ్మారో కనుక్కోవాలని అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించినా ధైర్యం, పట్టుదల, సాహసం, సంకల్పంతో కుట్రలు అన్నీ ఛేదించి 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. వైఎస్ఆర్ పులి కాబట్టే ఆయన కడుపున జగన్ పులిగా పుట్టారన్నారు. చంద్రబాబు నక్క.. ఆయన కడుపున గుంట నక్క లోకేష్ పుట్టాడు అంటూ పేర్ని నాని వ్యంగాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ కూడా గెలవలేని పరిస్థితిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉందనీ, ఇది వారి దౌర్బాగ్యం అని మంత్రి పేర్ని నాని అన్నారు.