రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇన్నే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడంపై ఏపి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సినిమా పిచ్చి ఉన్న వాళ్లే పవన్ మీటింగ్ లకు వస్తున్నారని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కు లేదని విమర్శించారు. పవన్ కు రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేసే దమ్మే లేదని అన్నారు. అన్ని స్థానాల్లో నిలబెట్టేందుకు అభ్యర్ధులే జనసేనకు లేరు కానీ అసెంబ్లీలో జెండా ఎగురవేస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచ్ గా గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యే గురించి ఆలోచించాలని హితవు పలికారు. పవన్ సర్వే చూస్తే నవ్వు వస్తుందని ఆమె అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ కూడా పవన్ ను చూసి నవ్వుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది పవన్, చంద్రబాబు కాదా అని రోజా ప్రశ్నించారు. పవన్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదనీ, చంద్రబాబు కోసమని రోజా విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలివేసి పారిపోయి వచ్చిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. పవన్ డైలాగులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. విభజన చట్టంలో ఏపి ఆస్తులపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. ప్యాకేజీలు తీసుకుని వేరే పార్టీకి ఓటు వేయమని చెబుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేస్తే , పవన్ మాత్రం 2014 లో ప్యాకేజీ కి ఆశపడ్డారని ఆరోపించారు. ప్యాకేజీ కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఏపి ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మద్దతుగా ఉన్నారనీ, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. లోకేష్ తన అజ్ఞానాన్ని మరో సారి ఈ రోజు కూడా బయట పెట్టుకున్నారని అన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు కాదా అని రోజా విమర్శించారు. రైతుల కోసం ఏమి చేశారన్నది లోకేష్ చంద్రబాబును అడగాలన్నారు. జగన్ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారని రోజా తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రైతులకు చేసింది శూన్యమని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరవు వస్తుందని అదే జగన్ అధికారంలో ఉన్న ప్రతి ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని అన్నారు మంత్రి రోజా.
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. బస్సు యాత్ర వాయిదా .. ఎందుకంటే..?