Vidatala Rajani: ఆమె జన్మించింది సాధారణ మద్యతరగతి కుటుంబంలోనే..! చదువుకున్నది సాధారణ చిన్న పాటి స్కూళ్లలో.. కాలేజీల్లోనే..! ఉద్యోగ ప్రస్తానం మొదలు పెట్టింది కూడా చిన్న ఐటీ కంపెనీలో..! కానీ ఆమె వందలాది కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీలకు అధిపతిగా ఎలా ఎదిగారు..? రాజకీయాల్లో అతి తక్కువ సమయంలోనే ఎలా రాణించగలిగారు…? పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఒక రాజకీయ ఉద్దండుడిని ఓడించి ఎమ్మెల్యే అయిన మూడేళ్లలోనే మంత్రిగా ఎలా ఎదిగారు…? సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఎలా సంపాదించుకున్నారు…? అదే సందర్భంలో సోషల్ మీడియాలో శత్రువులను ట్రోలర్స్ ను ఎలా సంపాదించుకున్నారు…? అసలు విడతల రజిని రాజకీయ ప్రస్థానం ఏమిటి.. ? ఆమె ఎలా ఎదిగారు..? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vidatala Rajani: సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి..
విడతల రజిని జూన్ 24, 1988లో గుంటూరు జిల్లాలో పుట్టారు. గుంటూరు జిల్లాలోనే ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నారు. అయిదు ఆరు తరగతుల వరకూ ప్రభుత్వ బడిలో, ఆ తరువాత హైస్కూల్ చదువు ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ లోని సెంట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ ( బీఎస్సీ) పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఆమె హైటెక్ సిటీలోని ఓ ఐటి కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యారు. ఆమె తల్లి రజక సామాజికవర్గం కాగా,. ఆమె తండ్రిది ముదిరాజ్ కమ్యూనిటీ. ఐటి ఉద్యోగం చేస్తున్న క్రమంలో యుఎస్ లో ఐటీ కంపెనీలో స్థిరపడిన కుమార స్వామితో పరిచయం ఏర్పడింది. రజినితో కుమార స్వామి పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. కుమార స్వామి కంపెనీలో ఉద్యోగిగా చేరడం తరువాత ఆయననే వివాహం చేసుకుని యుఎస్ కు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే కుమార స్వామి ఐటీ కంపెనీ వేల కోట్ల టర్నోవర్ కు వెళ్లిపోయింది. ఇక వారి చేతి నిండా డబ్బు ఉంది. భవిష్యత్తుకు ఇబ్బంది, బెంగ లేదు. రజిని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.
Vidatala Rajani: సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి
ఇక రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వచ్చి సొంత జిల్లాకు వచ్చి 2012 లో చిలకలూరిపేటలో విఆర్ ట్రస్ట్ (విడతల రజిని ట్రస్ట్)ను ప్రారంభించారు. ఆ ట్రస్ట్ పేరుతో చిలకలూరిపేట నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. అప్పుడు పత్తిపాటి పుల్లారావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో రజిని ఎవరో చాలా మందికి తెలియదు. ఓ ట్రస్ట్ నడుపుతున్న మహిళగానే అందరికీ తెలుసు. అయితే ఆమెకు మంచి తెలివితేటలు ఉన్నాయి. త్వరగా నేర్చుకునే గుణం ఉంది. మంచి వాక్ చాతుర్యం ఉంది. ఈ మూడు లక్షణాలు ఆమెను బాగా పైకి తీసుకువచ్చాయి. ఆమె ప్రసంగం పట్ల ప్రజలు బాగా ఆసక్తి చూపడంతో 2017లో విశాఖలో జరిగిన టీడీపీ మహానాడులో రజినికి మాట్లాడే అవకాశం వచ్చింది. పత్తిపాటి పుల్లారావే ఆమెను వేదిక మీదకు తీసుకువెళ్లి మాట్లాడించారు. ఆ మాటలే రజిని జీవితాన్ని మలుపుతిప్పాయి. అక్కడ మాట్లాడే క్రమంలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తి జగన్మోహనరెడ్డిని రాక్షసుడితో పోల్చారు. చంద్రబాబును ఉద్దేసించి మీరు నాటిన ఐటి మొక్కలో ఎదిగిన తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు పిల్లలకు ఎవరైనా రాక్షసుడి బొమ్మ చూపించాలి అంటే జగన్ బొమ్మ చూపించండి అంటూ ప్రసంగించి టీడీపీ వాళ్లందరినీ ఆకట్టుకుంది విడతల రజిని. ఆమె ప్రసంగానికి టీడీపీ శ్రేణులు ఫిదా అయ్యారు. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. దీంతో ఆమెకు టీడీపీలో ఒక క్రేజ్ వచ్చేసింది.
Vidatala Rajani: రాజకీయ గురువునే ఓడించి
ఆ క్రేజ్ తో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చిలకలూరిపేటలో పోటీ చేయాలని చంద్రబాబును సీటు అడిగారు. అప్పటికే చిలకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు ఉండటంతో చంద్రబాబు ఆమె అభ్యర్ధనను తిరస్కరించారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలన్న కోరిక ఉండటం, టీడీపీలో అది నెరవేరకపోవడంతో 2018 ఆగస్టులో జగన్మోహనరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అక్కడకు వెళ్లి వైసీపీలో చేరారు. ఆ తరువాత నియోజకవర్గానికి వచ్చి తానే ఎమ్మెల్యే అభ్యర్ధిగా చెప్పుకుని సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. అప్పటికే మర్రి రాజశేఖర్ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయనకు సమాచారం లేకుండానే రజిని వైసీపీలో చేరారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా రజిని అయితేనే గెలుస్తారు అని రిపోర్టు ఇవ్వడంతో జగన్మోహనరెడ్డి ఆమెకు టికెట్ ఖరారు చేశారు. తన రాజకీయ గురువు అయిన పత్తిపాటి పుల్లారావుపైనే విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో క్రేజ్ పెంచుకున్నారు. ఎమ్మెల్యే అయిన తరువాత తన ప్రతి కార్యక్రమానికి విస్తృత ప్రచారం జరిగేలా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. స్వతహాగా ఐటీ ప్రొఫిషనర్ కావడంతో ప్రమోషన్ పై దృష్టి పెట్టారు.
Vidatala Rajani: ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడేళ్లకే మంత్రి పదవి
సోషల్ మీడియాకు ప్రత్యేకంగా ఒక టీమ్ ను పెట్టుకుని దాని కోసం కొంత బడ్జెట్ కేటాయించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకానొక దశలో రోజాను, సినీ సెలబ్రిటీలను బీట్ చేసే స్థాయిలో ఆమె పోస్టులు వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఆమెకు వ్యతిరేక ట్రోల్స్ కూడా జరిగాయి. తనకు అవకాశం వచ్చిన ప్రతి సారి జగన్మోహనరెడ్డిని విడతల రజిని పొగుడుతూనే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్ ద్వారా విడతల రజిని పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ తో ఆమెకు పడదు. వైసీపీ ఎంపీతో పడదు. అయినా పార్టీ పెద్దల దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయంగా ఏమి చేయాలో అన్నీ చేసి తాను అనుకున్న మంత్రి పదవిని సాధించారు. ఓ బీసీ మహిళగా, కింది స్థాయి నుండి వచ్చిన మహిళగా, ఓ సంపన్నురాలిగా, మంచి వాక్ చాతుర్యం ఉన్న నేతగా జగన్మోహనరెడ్డి దృష్టిలో పడటంతో మంత్రి పదవి ఇచ్చారు. సాధారణ మధ్యతరగతి నుండి వచ్చి ఐటి ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు విడతల రజిని. రజిని ముదిరాజ్ సామాజికవర్గం కాగా, ఆమె భర్త కుమారస్వామి కాపు సామాజికవర్గం. ఈ ఇద్దరూ ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?