Vidadala Rajini: ఏపి ప్రభుత్వానికి వివిధ శాఖల పనితీరుపై కేంద్రం నుండి వరుసగా అవార్డులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపి ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ అవార్డు దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్”లో ‘ ఈ అవార్డును ఏపి వైద్యశాఖ మంత్రి విడదల రజిని అందుకున్నారు. మహిళల కోసం డిజిటల్ హెల్త్’ నేపథ్యంతో రూపొందించిన లోగోను మంత్రి విడదల రజిని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంపై ఆమె ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి రజిని గారు మాట్లాడుతూ ఏపిలో 80 శాతం హెల్త్ కార్డులను డిజిటలైజేషన్ చేశామనీ తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా కోట్లాది మంది లబ్దిపొందుతున్నారన్నారు. లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత (4As) పునాదులుగా వైద్య రంగాన్ని పటిష్టంగా నిర్మించేలా ఏపీ అడుగులు వేస్తుందని వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో సమగ్ర వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) ప్రమాణాలను అనుసరిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ మల్టీ స్పెషాలిటిల్లా మార్చిన ప్రక్రియను మంత్రి వివరించారు. ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లో మోడల్ గా నిలుస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ విషయంలో ఇప్పటికే ఆరు అవార్డులను అందించిన విషయాన్ని మంత్రి రజిని గుర్తు చేశారు. పీపీపీ పద్ధతిలో ఏపీలో ఆర్ట్ మెడికల్ టీచింగ్ యూనివర్శిటీ, రీసెర్చ్ వర్సిటీ ఏర్పాటు, సమగ్ర సదుపాయాలతో కాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, డిజిటల్ వైద్య సేవలందించడంలో కలిసి పని చేయడానికి ముందుకు రావాలని ఔత్సాహికులను మంత్రి రజిని ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో 16 చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి గల అవకాశాలను ఆరోగ్య సదస్సులో మంత్రి వివరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ‘ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్’ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.