జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖను రాజధానిగా పవన్ ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు బొత్స. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు శనివారం నాటి విశాఖ గర్జన ప్రతిరూపం గా నిలిచిందని, జోరు వర్షంలోనూ ప్రజలు గర్జనలో పాల్గొన్నారని మంత్రి తెలిపారు. విశాఖ రాజధాని వద్దనే వారికి ఇది ఓ కనువిప్పు అని పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరి మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన సంఘటనను చంద్రబాబు తప్పుపట్టడంపోయి పోలీసులను తప్పు పడతారా అని ప్రశ్నించారు. మంత్రులపై దాడిని ఎందుకు తప్పుబట్టడం లేదని ప్రశ్నించారు. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండాలనీ, అమరావతికి ఏ కనెక్టివిటీ అందని ప్రశ్నించారు మంత్రి బొత్స. విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మూడు రోజులు కాల్ షీట్ ఇచ్చారనీ, అందులో భాగంగానే విశాఖలో అలజడి సృష్టించారని మరో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దేశంలోని నగరాలతో పోటీపడగల అతి పెద్ద నగరం విశాఖపట్నం అని అన్నారు. విశాఖ గర్జనకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. చంద్రబాబు నుండి పవన్ ప్యాకేజీ తీసుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులపై దాడులు చేయించారని అన్నారు. దాడులు చేస్తే అరెస్టు చేయకుండా సన్మానాలు చేయాలా, హింసు ప్రోత్సహిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని అంబటి ప్రశ్నించారు. గర్జనకు వచ్చిన ప్రజాదరణను డైవర్ట్ చేయడానికే పవన్ ప్రయత్నం చేశారని విమర్శించారు. జనసేన పేరును బాబు సేనగా మార్చుకోవాలన్నారు. హింసను ప్రేరేపించిన ఏ రాజకీయ పార్టీ బతికి బట్టగట్టిన చరిత్ర లేదని జనసేన శ్రేణులు గుర్తుంచుకోవాలని అన్నారు మంత్రి అంబటి. విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి పేర్కొన్నారు.
విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ విశాఖ పర్యటన పెట్టుకున్నారని మంత్రి గుడివాడ అమరనాథ్ ధ్వజమెత్తారు. నిన్న మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ టెర్రరిస్ట్ గా అభివర్ణించిన మంత్రి అమరనాథ్ .. ఆయన ఉత్తరాంధ్ర పై కక్షకట్టారంటూ మండిపడ్డారు. జనసేన కార్యకర్తల దాడులను పవన్ సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం షూటింగ్ లకు సెలవు కాబట్టే పవన్ విశాఖకు వచ్చారని మంత్రి అమరనాథ్ విమర్శించారు. తమ విధానం మూడు రాజధానులైతే జనసేన విధానం మూడు పెళ్లిళ్లు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్ మెంట్, పెళ్లాంతోనే అడ్జస్ట్ కాలేని పవన్ .. ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని మంత్రి అమరనాథ్ ప్రశ్నించారు. లక్షా 80వేల పుస్తకాలు పవన్ చదివింది దీనికోసమేనా అని విమర్శలు గుప్పించారు.