జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. పవన్ ను పరామర్శించిన చంద్రబాబు. విశాఖలో జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు భేటీపై పలువురు మంత్రులు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలకు మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమరనాథ్, కొట్టు సత్యనారాయణలు స్పందించారు.
ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం ్ంటే ఏమిటో తెలుసా నీకు అంటూ మంత్రి అమరనాథ్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం లో ప్రజలు ఇచ్చిన తీర్పు .. మిమ్మల్ని చెప్పుతో కొట్టడమేనని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పిన విశాఖ గర్జనను, విశాఖ రాజధాని కావాలన్న డిమాండ్ ను పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ కుటిల యత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ లోని ప్రస్ట్రేషన్ అంతా చూస్తుంటే ఆయనను మూడవ భార్య కూడా వదిలివేసి ఉంటుందని కూడా వైరల్ కామెంట్స్ చేశారు. మరో సారి టీడీపీ, జనసేన మద్య కుదురుతుందని భావిస్తున్న పొత్తును ఆయన భార్య భర్తల సంబంధం తోనే పోల్చారు అమరనాథ్. వైసీపీ నేతలపై జనసేన నేతలు దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ ను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారు అంటూ మరో మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన పార్టీని అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడన్నారు. ముద్రగడ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కనీసం విచారం అయినా వ్యక్తం చేశావా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ నీ ప్యాకేజీ బయటపడుతోందని విమర్శించారు. మరో మంత్రి జోగి రమేష్ ఘాటుగా కామెంట్స్ చేశారు. ముసుగు దొంగల నిజస్వరూపం బయటపడిందన్నారు. విశాఖ గర్జన విజయవంతాన్ని జీర్ణించుకోలేక కర్రలు, రాళ్లతో దాడి చేశారని, సైకోలను తమ మీదకు పంపారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్కతో సమానమని ఏడాదిన్నర క్రితమే తాను చెప్పానన్నారు.
పొద్దున బీజేపీకి విడాకులు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాడని అన్నారు. అధికారం కోసం అర్రులు చాస్తున్నారనీ, వారికి సిద్ధాంతాలు, విలువలు, మానవత్వం లేవు అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్మోహనరెడ్డిని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. టైమ్, డేట్, ప్లేస్ నువ్వు చెప్పు .. ఎవరేమిటో తేల్చుకుందాం, కొట్లాడుకోవడం కోసం చర్చించుకుందాం అని పేర్కొన్నారు. 14 ఏళ్లలో మీ యజమాని ఏమి చేశారో, మూడేళ్లలో మేము ఏమి చేశామో చర్చిద్దామన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోకపోతే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాలనీ లేకుంటే ప్యాకేజీ స్టార్ అని వంద సార్లు అంటామన్నారు జోగి రమేష్.
Pawan Kalyan: వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్