మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఏపికి చెందిన వంద మందికి పైగా విద్యార్ధులు అక్కడ చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మణిపూర్ లోని ఎన్ఐటీ, ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ లో చదువుతున్న ఏపి విద్యార్ధులను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు విద్యార్ధులంతా తమతో టచ్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్ధుల లిస్ట్ ఔట్ చేసినట్లు తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తో మాట్లాడి విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విద్యార్ధుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టామని తెలిపారు. విద్యార్ధులు వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లని తీసుకువచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. సుమారు వంద మంది మణిపూర్ విద్యార్దులు ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారనీ, ఇంకా 50 మంది వరకు ఉంచవచ్చని తమ అంచనాగా పేర్కొన్నారు. 150 మందికి సరిపడే విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స వివరించారు.