AP Municipal Elections 2021: ఏపిలో నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కుప్పం మున్సిపాలిటిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఒక వైపు దొంగ ఓటలు, మరో వైపు దౌర్జన్యాలకు దిగుతున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. 18,19 వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఏజెంట్ లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆ యువకులు కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. కొత్తపేట జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి ఓటరు స్లిప్ లు ఇస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
AP Municipal Elections 2021: వైసీపీ, టీడీపీ పరస్పరం ఫిర్యాదులు
మరో పక్క కుప్పంలో టీడీపీ అరాచకం చేస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఓటర్లకు నేరుగా చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని, ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు ఓటర్లకు ఫోన్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కుప్పంలో ఓటర్లకు చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను టీడీపీ నేతలు పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. టీడీపీ నాయకులు అంతా ఆందోళనకు దిగాలంటూ పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. వైసీపీ ఓటర్లను టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటు వేయడానికి వెళుతున్న ఓటర్లను టీడీపీ వారు చెక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని పోలీసులకు అప్పగించినా వారిని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా వదిలివేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
ఏలూరులో 45వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి ఇంటి ముందు ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నారని టీడీపీ ఆరోపణ చేస్తోంది. దీంతో ఒటర్లు వైసీపీ అభ్యర్ధి ఇంటి ముందు ఓటర్లు బారులు తీరారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని ఓటర్లను పంపించి వేశారు. కాకినాడ నగర పాలక సంస్థలోని 3,9,16,30 డివిజన్ లలో పోలింగ్ జరుగుతోంది. 16వ డివిజన్ లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ 1, 2 కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలువురుని టీడీపీ నేతలు పట్టుకోవడంతో వారి మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నెల్లూరు నగర పాలక సంస్థలో పోలింగ్ తీరును, వెబ్ కాస్టింగ్ ను కలెక్టర్ చక్రధర్ బాబు, కమిషనర్ పరిశీలించారు. నెల్లూరులో వర్షం పడుతున్న కారణంగా ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు వర్షం కారణంగా తడిసిపోయాయి.
పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఎంపిని గోరంట్ల మాధవ్ ను అడ్డుకున్న టీడీపీ నేత
అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పోలింగ్ లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపి గోరంట్ల మాధవ్ ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిద్దరికి సర్దిచెప్పి అక్కడ నుండి పంపించి వేశారు.