Municipal Elections : రాష్ట్రంలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలోని 581 డివిజన్ లు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 1,633 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. 580 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 2,214 డివిజన్, వార్డుల్లో 77,73,231 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 7,549 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కృష్ణా, గుంటూర, విశాఖ జిల్లాల్లో ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. కృష్ణాజిల్లాలో పోలింగ్ సరళిని ఆయన పరిశీలిస్తున్నారు. గుంటూరులో పోలింగ్ ప్రక్రియను ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు పర్యవేక్షిస్తున్నారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ పడమటలో జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ వద్దకు చేరుకుగా పెద్ద సంఖ్యలో అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించి పోలీస్ అధికారులు పవన్ ను ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రంలోకి పంపి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. పవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే ప్రధమం అని సమాచారం.
విశాఖ మారుతీనగర్ లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భార్యతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపి సబ్బం హరి పోలింగ్ కేంద్రం వద్ద విజయసాయిరెడ్డి తారసపడటంతో మర్యాదపూర్వకంగా పలకరించారు. విజయసాయి రెడ్డి నమస్కారం పెడుతూ ముందుకు వెళ్లిపోయారు. గుంటూరులో భర్తకు ఒక వార్డులో, భార్యకు మరో వార్డులో ఓట్లు ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఇదే సమస్య ఎదురైంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేరువేరు వార్డులో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రలోభాలపై అధికారులకు పిర్యాదులు చేస్తున్నారు.