AP New Districts: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలను పునర్వ్యవస్థీరించాలని 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది జూలై నెలలో కొత్త జిల్లాల ఏర్పాటునకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చి 31లోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జనవరి పదవ తేదీ నాటికి సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పార్లమెంట్ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటునకు కమిటీ నివేదిక తయారు చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క అరకు లోక్ సభ స్థానంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. 26 జిల్లాలు ఏర్పాటుకు, మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రదిపాదిస్తూ అధ్యయన కమిటీ నివేదిక ఇచ్చింది.
AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అంతరాయం
ఈ ఏడాది జనవరి నెలలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందింది. అయితే ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తరువాత కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. మరో పక్క రాష్ట్రానికి ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి మరింత భారం పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేస్తున్న వ్యయం 67,340 కోట్లకు చేరింది. ఈ పరిస్థితుల్లో మరో 13 జిల్లాలు పెరిగితే ఆయా జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని శాఖల జిల్లా కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకం, ఎస్టాబ్లిషన్ మెంట్ తదితర ఖర్చులు ప్రభుత్వానికి తలకు మించిన భారం అయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందనీ కేంద్రం గ్రాంట్ లు ఇచ్చి ఆదుకోవాలంటూ ఇటీవల పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ, డీఏలు తదితర సమస్యలపై ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపునకే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సో..రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యే వరకూ కొత్త జిల్లాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్ లో పెట్టవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి.