AP News: “తాంబూలాలు ఇచ్చాం –తన్నుకు చావండి” అన్న సామెత మాదిరిగా కేంద్రం తీరు కనబడుతోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన చట్టంలోని అనేక హమీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అదీ లేదు. “పాడిందే పాటరా పాటిపళ్ల దాసరా” అన్నట్లు ప్రత్యేక హోదాను కేంద్రాన్ని వైసీపీ సర్కార్ అడుగుతూనే ఉంది, కేంద్రం కూడా అదే మదిరిగా ముగిసిన అధ్యాయమని చెబుతూ వస్తూనే ఉంది. ఏపి, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఇంత వరకూ తేలలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటినా సమస్యలు అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి.
AP News: మీరు మీరు తేల్చుకోండి
తెలంగాణ రాష్ట్రం నుండి ఏపికి రావాల్సిన విద్యుత్ బకాయిలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం షాక్ ఇచ్చేలా సమాధానం చెప్పింది. విద్యుత్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఏపి, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయ రాష్ట్రాలకు సూచించినట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు విజయసాయి రెడ్డికి సమాధానం ఇచ్చారు. అదే విధంగా ప్రత్యేక హోదాపై విజయసాయి అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కేంద్రం సమాధానమిచ్చింది.
ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ నిధుల లెక్క ఇది
ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు తీసుకున్నారుగా.. మళ్లీ ప్రత్యేక హోదా అంటారేమిటి అన్నట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రశ్నించారు. ఏపి ప్రభుత్వం కోరడం వల్లనే ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి ఇచ్చామంటూ లెక్కలు చెప్పారు. ఏపికి 2015 – 19 మధ్య ప్రత్యేక ప్యాకేజీకి కింద 19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.22,112 కోట్లు అందించినట్లు వివరించారు. 2020- 21 లో ఏపికి రూ.5,897 కోట్లు ఇచ్చామని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కాకపోతే గుడ్డిలో మెల్ల బెటర్ అన్నట్లు విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని కేంద్ర మంత్రి వెల్లడించారు.