AP News: రాష్ట్రంలో ఆసుపత్రులను అభివృద్ధి పర్చాం, వైద్య సేవలను మెరుగుపర్చాం, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని పాలకులు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రజా ప్రతినిధులు,. అధికార పార్టీ నేతలు ప్రజలకు సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులు వృధా చేసుకోవద్దు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. కానీ ప్రజా ప్రతినిధులకు ఏదైనా ఆనారోగ్యం వచ్చినా, చివరకు కరోనా సోకినా వెంటనే పొరుగు రాష్ట్రాలలో వైద్య సేవలకు పరుగులు తీస్తున్నారు. అంటే మన రాష్ట్రం కంటే పొరుగు రాష్ట్రాల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నట్లు వారు భావిస్తున్నారా..?
Read More: Rajya Sabha: వైసీపీలో జాక్ పాట్ కొట్టే ఆ ముగ్గురు ఎవరంటే..?
AP News: మంగళగిరిలో ఏఐఐఎంఎస్ ఆసుపత్రి ఉన్నప్పటికీ
అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా సోకిన సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లి చికిత్స పొంది వచ్చారు. చివరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకిన సమయంలోనూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. విజయవాడకు కూత వేటు దూరం మంగళగిరిలో ఏఐఐఎంఎస్ ఆసుపత్రి ఉన్నప్పటికీ విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ కే వెళుతున్నారు. ఇక్కడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యంపై ప్రజా ప్రతినిధులకే నమ్మకం లేకపోతే ఎలా ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ప్రజా ప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా..?
ప్రస్తుతం పీఆర్సీ సమస్యపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుండటంపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ వేలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చదివించకుండా ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా అని వాళ్లు ప్రశ్నిస్తే సదరు మంత్రి ఏమి సమాధానం చెప్పగలరు. ఎవరైనా ప్రజా ప్రతినిధులు జనాలకు చెప్పాలంటే ముందుగా వారు ఆచరించి మరొకరికి చెబితే బాగుంటుంది అని అంటున్నారు.