రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.
ఈ తరుణంలోనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఏపీ ఎన్జీఓల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ కు పలు దఫాలు తెలియజేశామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం అప్రజాస్వామిక మన్నారు.
బీహారు, తెలంగాణ లో ఎన్నికల తర్వాత కరోనా వ్యాప్తి చెందిందన్నారు. తక్షణం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పెడితే ప్రజలు కరోనాతో భయ బ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్, బర్డ్ఫ్ల్యూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఎస్ఈసీ మొండిగా ముందుకు సాగితే న్యాయ పోరాటానికి దిగుతామని, ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.