KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గొప్ప మనసు గురించి ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న ప్రజలు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే, గులాబీ దళపతి తీసుకున్న నిర్ణయం అలాంటిది. తెలంగాణలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది వరకు ప్రజలు ఉండగా వీరందరికీ వర్తించేలా తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు కేసీఆర్పై ప్రశంసలకు కారణం.
ఇది కేసీఆర్ నిర్ణయం….
వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదనీ, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తర్వాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
అంతే కాదు…
కరోనా వ్యాక్సిన్ తో పాటుగా మరో ముఖ్యమైన నిర్ణయం సైతం తెలంగాణ సీఎం తీసుకున్నారు. వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమ్ డిసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టుతోందని భరోసా ఇచ్చారు. ప్రజలను అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దన్నారు.
ప్రజలు గుంపు,గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని సీఎం కేసీఆర్ సూచించారు.