AP Police: ఏపిలోని ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి కొడాలి నానితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో వారికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై వారు ఫిర్యాదు చేయగా, వారి భద్రతను కమిటీ సమీక్షించింది. టీడీపీ సానుభూతిపరులు ఈ నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రత పెంపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read More: AP Capital Issue: జగన్ వెనుకడుగు వెనుక ఈ భారీ వ్యూహం..??
AP Police: మంత్రి కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతకు అదనంగా 1 ప్లస్ 4 గన్ మెన్ లను ఏర్పాటు చేయడంతో పాటు కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1 ప్లస్ 1 గన్ మెన్ లతో పాటు అదనంగా 3 ప్లస్ 3 గన్ మెన్ భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండే అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్
ఇటీవల అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు తనతో పాటు తన భార్యను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీని బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు అనంతరం టీడీఎల్పీ సమావేశంలో భావోద్వేగానికి గురై తీవ్రంగా ఏడ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులు, సాధారణ ప్రజానీకానికి ఆగ్రహం కల్గించింది. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి సంఘీభావం కూడా ప్రకటించారు. పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును విమర్శించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో మంత్రితో సహా ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అదనపు భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?