జర్నలిస్ట్ లు అంటే కొంత కాలం క్రితం వరకూ అటు రాజకీయ నాయకులు, ప్రముఖుల్లో, ఇటు ప్రజల్లోనూ మంచి గౌరవం, గుర్తింపు ఉండేవి. ప్రజలు కూడా తమ సమస్యలు పరిష్కారానికి జర్నలిస్ట్ లను ఆశ్రయించే వాళ్లు. కొందరు రాజకీయ పార్టీల నేతలు కూడా కుంభకోణాలు వెలికి తీసేందుకు జర్నలిస్ట్ లకే సమాచారం ఇస్తుండే వారు. గతంలో పత్రికారంగంలో అవినీతి చాలా తక్కువగా ఉండేది. అయితే ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్లు వీరు, వీరు వారు అవుతారు అన్నట్లుగా అవినీతికి పాల్పడే వారి సహవాసంతో కొందరు జర్నలిస్టులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గత కొద్ది సంవత్సరాల నుండి వివిధ శాఖల్లో ఉన్నట్లుగానే అవినీతికి పాల్పడే వాళ్లు ఈ వ్యవస్థలోనూ తయారైయ్యారు. దీంతో కొందరి కారణంగా ఈ వ్యవస్థకే చెడుపేరు రావడంతో నిజాయితీగా పని చేస్తున్న వారు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు.
అక్రమ మద్యం, అక్రమ ఇసుక, అక్రమ రేషన్ బియ్యం రవాణా వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, పలు చోట్ల కొందరు మీడియా వాళ్లు పట్టుబడిన సంఘటనలు ఇంతకు ముందు వెలుగు చూశాయి. అయితే ఇప్పటి వరకూ చిన్న చితకా పత్రికల విలేఖరులు, యూట్యూబ్ ఛానళ్ల వాళ్లు పట్టుబడుతూ రాగా ఇప్పుడు తాజాగా ఏపిలో ప్రముఖ ఛానల్స్ కు చెందిన ముగ్గురు పెద్ద భూదందాలో పట్టుబడటం హాట్ టాపిక్ అయ్యింది. కోట్ల రూపాయల డీల్ లో లక్షలాది రూపాయలు చేతులు మారడం, అక్రమ రిజిస్ట్రేషన్ లో విలేఖరుల పాత్ర వెలుగు చూడటం సంచలనం అయ్యింది.
వివరాల్లోకి వెళితే..అనంతపురం రూరల్ మండల పరిధిలోని రాచనపల్లి సమీపంలో 14.96 ఎకరాల భూమిని ప్రముఖ ఛానళ్లకు చెందిన ముగ్గురు రిపోర్టర్లు కలిసి మరొకరికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు నాల్గవ పట్టణ పోలీసులను ఫిర్యాదు చేశారు. భూమిని కాజేసేందుకు ఒకరి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి అతనే భూ యజమాని అన్నట్లుగా చిత్రీకరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో భూ యజమాని వెంకట సుబ్బయ్య స్పందనలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విలేఖరులు హనుమంతు, వేణుగోపాల్, రమేష్ పాత్ర వెలుగులోకి వచ్చింది. మరో ప్రముఖ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. సీసీ టీవీ పుటేజ్, నగదు లావాదేవీలకు సంబంధించి అధారాలను సేకరిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో రూ.14 కోట్ల కు డీల్ కుదిరిందనీ, ఇప్పటికే 75 లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది పాలుపంచుకున్నట్లుగా తెలుస్తొంది. ఈ కేసులో మొదట అంపగాని శ్రీనివాసులును పోలీసులు ఈ నెల 12వ తేదీన అరెస్టు చేశారు. అతన్ని విచారించగా బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్, కర్తనపర్తి సురేష్ పేర్లు బయటపడ్డాయి. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించగా, మూడు ప్రధాన న్యూస్ ఛానల్స్ విలేఖరుల పేర్లు బయటపడ్డాయని చెబుతున్నారు. అయితే ఆయా ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు మాత్రం ప్రస్తుతం ఈ నిందితులు తమ ఛానల్స్ లో పని చేయడం లేదనీ గతంలోనే తొలగించామని చెబుతున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో బిగ్ రిలీఫ్