AP Politics: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తుల చర్చలు మొదలైయ్యాయి. ఆరేడు నెలల క్రితం చంద్రబాబు కుప్పంలో పర్యటన సందర్భంలో కార్యకర్తలు జనసేనతో పొత్తు ఉండాలని మాట్లాడితే ఆయన వన్ సైడ్ లవ్ అయితే కుదరదు అంటూ పరోక్షంగా చెప్పారు. దీంతో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇటీవల జనసేన ఆవిర్భావ వేడుక సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివరలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వం అంటూ పరోక్షంగా చెప్పారు. అటు టీడీపీ నుండి ఇటు జనసేన నుండి పొత్తుల విషయంలో పరోక్షంగా సంకేతాలు బయటకు వచ్చినట్లు అయ్యింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ముసుగులో గుద్దులాటగా ఉంది. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తు ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అంటే జనసేన – బీజేపీలు టీడీపీతోనూ జతకట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒకే అంటుందా..? లేదా అనేది ఓ పెద్ద అనుమానం.
AP Politics: టీడీపీతో 2018 వార్ గుర్తు పెట్టుకున్న బీజేపీ
బీజేపీ జనసేనను వదులుకోవడానికి సిద్ధం లేదు. ఎందుకంటే బీజేపీకి ఏపిలో కార్యకర్తల బలం, రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైన నాయకుడు లేరు. ఆ లోటు బూచ్చుకోవాలంటే జనసేనతో బీజేపీ కలసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అటు పవన్ కళ్యాణ్ చరిష్మా, జనసేన క్యాడర్ తో లబ్దిపొందాలని బీజేపీ భావిస్తొంది. టీడీపీ జత కట్టేందుకు బీజేపీకీ 2018లో వాళ్ల మధ్య జరిగిన వార్ గుర్తుకు వస్తోంది. ఆ వార్ ఇంకా చల్లారలేదు. చంద్రబాబు మీద ఉన్న కోపంతోనే 2019లో బీజేపీ పరోక్షంగా వైసీపీ గెలుపునకు సహకరించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంత దెబ్బకొట్టాలో అంత దెబ్బకొట్టింది బీజేపీ. ఆ తరువాత కూడా సోము వీర్రాజు, జీవిఎల్ నర్శింహరావు తదితర నాయకులు అడపదడపా వైసీపీని విమర్శించాల్సి వచ్చినప్పుడు టీడీపీని, చంద్రబాబు పాలనను విమర్శిస్తూ వచ్చారు. గత ప్రభుత్వ పాలనను వైసీపీ ఎలా అయితే విమర్శిస్తుందో ఇప్పటికీ బీజేపీలోని కొందరు నాయకులు అదే విధంగా విమర్శిస్తూ ఉన్నారు. సోము వీర్రాజు, సునీల్ ధియోధర్, జీవిఎల్ నర్శింహరావు తదితర నాయకులు టీడీపీ పాలనను, చంద్రబాబును విమర్శిస్తూనే ఉన్నారు.
టీడీపీతో పొత్తుకు కొందరు బీజేపీ నేతలు విముఖత
ఈ పరిస్థితుల్లో జనసేన – టీడీపీలతో బీజేపీ కలుస్తుందా..? పొత్తుకు సిద్ధం అవుతుందా..? అంటే కన్ఫ్యూషనే..! అందుకే బీజేపీ పెద్దలు దీనిపై చర్చించడానికి రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులను ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలు తీసుకుంటున్నారని సమాచారం. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కొందరు బీజేపీ నేతలు సుముఖంగానే ఉన్నారు. రాంమాధవ్, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి తదితర కొందరు నాయకులు టీడీపీతో పొత్తుకు ఒకే చెబుతున్నారు. కానీ పొత్తు విషయంలో సోము వీర్రాజు అటు ఇటుగా మాట్లాడుతున్నారు. అలానే జీవిఎల్ నర్శింహరావు ఉన్నారు. వీళ్లను కూడా పిలిచి మాట్లాడాలనేది పార్టీ పెద్దల ఆలోచన. సోము వీర్రాజు నిన్న కూడా టీడీపీతో పొత్తు అవసరం లేదు. జనసేనతోనే తాము ఎన్నికలకు వెళతాము. తమ పార్టీ సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సీఎంగా అంగీకరించే వాళ్లే మాతో పొత్తుకు రావాలి అని అన్నారు.
వైసీపీతో అంతర్గత స్నేహం ..?
అందుకే రాష్ట్రంలో బీజేపీ – టీడీపీ పొత్తు విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దీనిపై ఒక నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం కారణంగా కేంద్రంలోని బీజేపీకి వైసీపీతో అవసరం ఉంది. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు బీజేపికి కావాలి. అందుకే ప్రస్తుత పరిస్థితిలో వైసీపీని వదులుకుని టీడీపీకి దగ్గర అవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే వైసీపీతో అంతర్గత పొత్తును బీజేపీ కొనసాగిస్తోంది. పొత్తుల అంశంపై ఏమి జరుగుతుందో కొద్ది రోజులు వేచి చూడాలి.