AP Politics: ఏపిలో 2014 నుండి 2019 మధ్య వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. వ్యక్తిగత ఇతరత్రా రకరకాల కారణాలతోనో లేక నియోజకవర్గ అభివృధ్దో లేక రాజకీయ కారణాలతోనో వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరారు. అయితే టీడీపీలో చేరిన 23 మందిలో 2019 ఎన్నికల్లో 22 మంది ఓడి పోయారు. కేవలం ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఇప్పుడు ఆ 23 మంది పరిస్థితి ఎలా ఉంది..ఆ నియోజకవర్గాల్లో వాళ్ల ప్రాధాన్యత ఎలా ఉంది. టీడీపీలోనే ఉన్నారా లేక వేరే పార్టీలోకి చేరారా.వాళ్ల ప్రస్తుత రాజకీయ పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంది అనే విషయాలను పార్ట్ 1, పార్ట్ 2 భాగాలుగా ఇవ్వడం జరుగుతోంది. పార్ట్ 1లో పది మంది నాయకుల రాజకీయ భవిష్యత్తుపై ఇస్తున్న కథనం ఇది.
అంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం చాంద్ బాషా: 2016 ఏప్రిల్ 23 ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపిలో చంద్రబాబు సమక్షంలో చేరారు. 2019లో ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించలేదు. ఈ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేశారు. చాంద్ బాషా ప్రస్తుతం ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ వ్యతిరేక గ్రూపుగా ఉన్నారు. వెంకటేశ్వర ప్ర్రసాద్ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ లో రెండు గ్రూపులు ఉన్నాయి. చాంద్ బాషాకు మళ్లీ టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. చాంద్ బాషా రాజకీయ పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది.
చిత్తూరు జిల్లా పలమనేరు అమరనాథ్ రెడ్డి: 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి 2016 జూన్ 17న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ చేరిన తరువాత అమరనాథ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత లభించింది. పరిశ్రమల శాఖ మంత్రి గా కూడా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన టీడీపీలో కీలకమైన నాయకుడుగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో అత్యంత కీలకమైన సీనియర్ నాయకుడుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం పలమనేని పార్టీ ఇన్ చార్జిగా, జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
జగ్గంపేట జ్యోతుల నెహ్రూ: జ్యోతుల నెహ్రూ 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుండి వైసీపీ తరపున గెలిచి 2016 లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబులు 2009 నుండి పోటీ పడుతున్నారు. 2009 లో జ్యోతుల నెహ్రూ పీఆర్పీ నుండి పోటీ చేయగా జ్యోతుల చంటిబాబు టీడీపీ తరపున పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. 2014లో జ్యోతుల నెహ్రూ వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. 2014 లో చంటిబాబు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో జ్యోతుల చంటిబాబు అలిగి 2019 ఎన్నికల నాటికి వైసీపీకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో జ్యోతుల చంటి బాబు వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా జ్యోతుల నెహ్రూ టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. జ్యోతుల నెహ్రూ పార్టీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ పార్టీ మారిన తరువాత ఓటమిపాలైయ్యారు. అలా జ్యోతుల నెహ్రూ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ టీడీపి తరపున కాకినాడ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.
పత్తిపాడు నియోజకవర్గం వరుపుల సుబ్బారావు: పత్తిపాడు నియోజకవర్గం నుండి వైసీపీ తరుపున గెలిచి టీడీపీ లో చేరిన వరుపుల సుబ్బారావుకు 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి వరుపుల రాజా టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా యాక్టివ్ గా ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు యాక్టివ్ గా లేరు. ఎక్కడ ఉన్నారో తెలియదు. సైలెంట్ అయిపోయారు. * రంపచోడవరం నియోజకవర్గం వంతల రాజేశ్వరి : 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన రాజేశ్వరి ఘోర ఓటమి పాలైయ్యారు. దాదాపు 40వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె యాక్టివ్ గా లేరు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఆమెకు టికెట్ కేటాయించే అవకాశం కూడా లేదని అంటున్నారు.
కోడుమూరు నియోజకవర్గం మణి గాంధీ : 2016 మార్చి నెలలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ సీటు కూడా ఇవ్వలేదు. బోర్ల రామాంజనేయులుకు 2019 టీడీపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం రామాంజనేయులే నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. మణి గాంధీ పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. * కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జయరాముడు: జయరాముడు కూడా 2016 ఫిబ్రవరిలో టీడీపీ లో చేరారు. 2019లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన టీడీపీ మీద అలిగి 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతానికి ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఆ నియోజకవర్గం నుండి రాజశేఖర్ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మణి గాంధీని, జయరాముడుని టిడీపీలో దగ్గర ఉండి చేర్పించింది జూపూడి ప్రభాకర్.. ప్రస్తుతం జూపూడి టీడీపీలో లేరు. జూపూడి కూడా 2014 కు ముందు వైసీపీలో ఉన్నారు. 2015లో టీడీపీలో చేరారు. టీడీపీలో కీలకమైన పదవులు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు వైసీపీకి వెళ్లి కీలక పదవిలో ఉన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఆదినారాయణ రెడ్డి : ఆదినారాయణరెడ్డి 2014 తరువాత వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కావడంతో వైసీపీని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఆదినారాయణరెడ్డికి మంచి ప్రయారిటీ ఇచ్చి ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపి స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. మళ్లీ టీడీపీకి చేరే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినబడుతున్నాయి.
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం ఉప్పులేటి కల్పన; 2016లో ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2014 ఎన్నిక ముందే ఉప్పులేటి కల్పన టీడీపీ నుండి వైసీపీ లో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే గెలిచి మళ్లీ టీడీపీలో చేరారు. టీడీపీలో ఈమె చేరిన తరువాత వర్ల రామయ్యది మరోక గ్రూపుగా నియోజకవర్గంలో ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమె యాక్టివ్ గా లేరు. వర్ల కుమారుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన కూడా అంత యాక్టివ్ తిరగడం లేదని అంటున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ : 2014లో వైసీపీ నుండి గెలిచి 2016 ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమార్తె కు టీడీపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆమె ఓడిపోయారు. ప్రసుతం నియోజకవర్గంలో జలీల్ ఖాన్ యాక్టివ్ గానే ఉన్నారు. వైసీపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.