AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో ఏమీ లేకపోయినా రాజకీయ వాతావరణం హీట్ గా నే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు సిద్ధం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఏపిలో ఊహించని రాజకీయ పరిణామాలు జరిగాయి. పలు జిల్లాల్లో కుటుంబాలు రాజకీయ పరంగా చీలిపోయాయి. పలు రాజకీయ కుటుంబాల్లో తండ్రి ఒక పార్టీ, కొడుకు మరో పార్టీ, అన్న ఒక పార్టీ తమ్ముడు మరో పార్టీగా చీలిపోయారు. ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలో చేరడం ఇష్టంలేని నేతలు కొందరు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ఎందుకు అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీల పొత్తులపై కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
AP Politics: టీడీపీ నుండి బీజేపీలోకి
ప్రస్తుతం తండ్రి బీజేపీలో, కొడుకు టీడీపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అర్ధం అయి ఉంటుంది కదా..? ఆ నాయకుడు ఎవరో.. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడే కాక పారిశ్రామికవేత్తగా అందరికీ సుపరిచితుడైన టీజీ వెంకటేష్ తన రాజకీయ జీవితంలో మూడు పార్టీలు మారారు. మొదట 1999లో టీడీపీ తరపున కర్నూలు ఎమ్మెల్యే గా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రెండవ సారి ఎమ్మెల్యే అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి మళ్లీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు.
కుమారుడు టీడీపీలోనే
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా చంద్రబాబు 2016లో ఆయనను రాజ్యసభకు పంపించారు. 2019 ఎన్నికల్లో జనసేన మద్దతు టీడీపీకి ఉంటుందని బలంగా నమ్మారు. అదే పార్టీలో కొనసాగి ఆయన కుమారుడు టీజీ భరత్ కు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే టీజీ భరత్ వైసీపీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీజీ వెంకటేశ్ మళ్లీ పార్టీ ఫిరాయించారు. ఇతర టీడీపీ రాజ్యసభ సభ్యులతో కలిసి ఆయన కూడా బీజేపీలో చేరారు. అయితే ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం టీడీపీ కర్నూలు ఇన్ చార్జి గా కొనసాగుతున్నారు. టీజీ వెంకటేశ్ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఆయన కుమారుడు టీజీ భరత్ కర్నూలు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే టీజీ వెంకటేష్ మళ్లీ రాజకీయ పార్టీ మారాల్సిన అవసరం లేదు. లేకుంటే కుమారుడు గెలుపు కోసం టీజీ వెంకటేశ్ మరో సారి పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు.